Coronavirus

వచ్చే ఏడాది కూడా కరోనా వ్యాప్తి కొనసాగుతుంది: ఎయిమ్స్

జాతీయం

డిల్లీ, సెప్టెంబర్ 6:  దేశంలో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) పేర్కొంది. లాక్ డౌన్ ఎత్తివేసిన కారణంగా జనసంచారం మళ్లీ పెరిగింది. దీంతో కరోనా కేసులు పెరగడంతోపాటు గ్రామాలకు కూడా వైరస్ పాకడం కారణంగా వచ్చే ఏడాది కూడా వైరస్ వ్యాప్తి కొనసాగుతుందని ఎయిమ్స్ డైరెక్టర్, భారత్ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. కేసుల వేగం పెరిగిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పడతాయని వివరించారు. కొంతకాలం పాటు ఇదేవిధంగా వైరస్ వ్యాప్తి కొనసాగే అవకాశం ఉందని గులేరియా అభిప్రాయపడ్డారు.

కాగా, ఒకేరోజు ఏకంగా 90 వేలకు పైగా కొత్త కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 90,633 మందికి కరోనా సోకిందని తెలిపింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 41 లక్షలు దాటింది. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు ఇవే. అదేసమయంలో 1,065 మంది మృతి చెందారు.

దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 41,13,812కు చేరుకోగా, మృతుల సంఖ్య మొత్తం 70,626 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 31,80,866 మంది కోలుకున్నారు. 8,62,320 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

 

Leave a Reply