
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
ఢిల్లీ ఆగష్టు 31 : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసారు. ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రణబ్… ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరారు. చికిత్సలో భాగంగా మెదడుకు సర్జరీ చేశారు వైద్యులు. ఆస్పత్రిలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందారు.
ప్రణబ్ 1935 డిసెంబర్ 11వ తేదీన అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని మిరటీలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా లోని చదువుకుని న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగి కేంద్రమంత్రి వర్గాల్లో పలు శాఖల్లో పని చేశారు. 2012-17 ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రణబ్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2008లో పద్మ విభూషణ్, 2019లో భారతరత్న అవార్డుతో సత్కరించింది. ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల దేశం యావత్తూ దిగ్భ్రాంతికి చెందింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన మరణానికి సంతాపాన్ని వ్యక్తపరిచాయి.